తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్.. గుజరాత్ చేతిలో పరాజయం

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఓటమి చవిచూసింది. శనివారం నోయిడాలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 31-28 తేడాతో పోరాడి ఓడిపోయింది. ఇరు జట్లు మొదటి నుంచి పాయింట్ల కోసం పోటీపడటంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అయితే, ఆశిశ్ నర్వాల్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఫస్టాఫ్‌లో 17-15తో స్వల్ప ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో కాసేపటకే టైటాన్స్ ఆలౌటవడంతో ఆ జట్టు 20-17తో వెనుకబడింది. ఆ తర్వాత చాలా సేపు గుజరాత్ స్వల్ప లీడ్‌లో ఉంది. ఈ సమయంలో విజయ్ మాలిక్, ఆశిశ్ నర్వాల్ పోరాటంతో టైటాన్స్ 26-26తో స్కోరును సమం చేసింది. అయితే, ఆఖర్లో గుజరాత్ ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచింది. పీకేఎల్‌ చరిత్రలో టైటాన్స్‌పై గుజరాత్‌కు ఇది 10 విజయం. ప్రతీక్ దహియా(11 పాయింట్లు) గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా.. టైటాన్స్ తరపున విజయ్ మాలిక్(15 పాయింట్లు) పోరాటం వృథా అయ్యింది. మ్యాచ్ కోల్పోయినప్పటికీ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానాన్ని కాపాడుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :