వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి..ఇద్దరి అరెస్టు

దేశంలో సెమీహైస్పీడ్‌ వందే భారత్‌ (Vande Bharat) రైళ్లపై దాడు(Stone attack)లు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్‌ (Bihar) రాష్ట్రం గయా (Gaya)లో రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను ఆర్‌పీఎఫ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు పాట్నా టాటా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గయా స్టేషన్‌ నుంచి బయల్దేరి మన్పూర్‌ రైల్వే సెక్షన్‌ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. అదేవిధంగా గయా-హౌరా వందే భారత్‌పై కూడా రాళ్ల దాడి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న గయా ఆర్పీఎఫ్‌ ప్రత్యేక బృందం ఘటనాస్థలికి దర్యాప్తు చేపట్టారు.

దాడికి పాల్పడింది మన్పూర్ వాసులు వికాస్‌ కుమార్‌ (20), మనీష్‌ కుమార్‌ (20)గా గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. తాము మరిన్ని రైళ్లను కూడా టార్గెట్‌ చేయబోతున్నట్లు విచారణలో బయటపెట్టారు. దీంతో అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైళ్లపై రాళ్ల దాడులను అరికట్టే చర్యలు ముమ్మరం చేశారు. వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు చేసిన ఘటనపై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌సేవక్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 153, 147 రైల్వే యాక్ట్ కింద గయాలో కేసు నమోదు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :